బాలింతకు అరుదైన చికిత్స
అనంతపురం మెడికల్: పొట్టకూటి కోసం బిహార్ నుంచి వలస వచ్చి హిందూపురంలో స్థిరపడిన సురభీబాయికి అరుదైన చికిత్సతో సర్వజనాస్పత్రి వైద్యులు ప్రాణాలు కాపాడారు. గురువారం జీజీహెచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, గైనకాలజీ విభాగం హెచ్ఓడీ షంసాద్బేగం,తో కలసి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. సురభీబాయి తొలిసారి గర్భం దాల్చినప్పుడు అబార్షన్ జరిగింది. రెండోసారి గర్భం (7 నెలలు) దాల్చిన ఆమె తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండగా భర్త సాహిన్ వెంటనే హిందూపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గత నెల 12న సర్వజనాస్పత్రిలో చేర్పించాడు. హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం ఆదేశాలతో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీలేఖ, డాక్టర్ అరుణ, పీజీలు డాక్టర్ సుష్మిత, కావ్య, ఇందుశ్రీ ప్రత్యేక చొరవ తీసుకుని గర్భంలోనే శిశువు మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. అబ్రప్షన్ ప్లసంటా ప్రీవియా (మాయ దెబ్బతినడం)తో తీవ్ర రక్తస్రావం జరుగుతోందని, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా 4 గ్రాములకు పడి పోయినట్లుగా వైద్య పరీక్షల్లో గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సురబీబాయిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చేర్చి నెఫ్రాలజిస్టు డాక్టర్ హరీష్ పర్యవేక్షణలో 6 సార్లు డయాలసిస్ చేయించారు. ఐదు యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. అనంతరం జీజీహెచ్కు తరలించి ఖరీదైన మందులతో సాధారణ స్థితికి తీసుకువచ్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత గురువారం డిశ్చార్జ్ చేశారు. ఈ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.8 లక్షల వరకూ ఖర్చు అవుతుందని, సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్యులను తానెన్నటికీ మరిచి పోలేనంటూ భర్త సాహిన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కార్యక్రమంలో గైనకాలజిస్టులు డాక్టర్ సుచిత్ర, డాక్టర్ రేణుక, తదితరులు పాల్గొన్నారు.


