‘పట్టు’ వీడని తెగుళ్లు
● గూళ్లకు సోకుతున్న సున్నపుకట్టు ఽవ్యాధి
● చలి తీవ్రత కారణంగా తగ్గుతున్న దిగుబడి
● ధరలు ఆశాజనకం
హిందూపురం: పట్టు గూళ్ల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నా... తెగుళ్ల కారణంగా దిగుబడిపై ప్రభావం చూపడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. వాతావరణంలో పెరిగిన చలి తీవ్రత కారణంగా సున్నపు కట్టు వ్యాధి ప్రబలి దిగుబడి తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్కు గతంలో రోజూ 6 వేల క్వింటాళ్లకు పైగా పట్టు గూళ్లు విక్రయాలకు రైతులు తీసుకువచ్చేవారు. హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, లేపాక్షితో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వందలాది రైతులు తమ పట్టు గూళ్ల ఉత్పత్తుల విక్రయానికి హిందూపురంలోని మార్కెట్పైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుత సీజన్లో దిగుబడి క్రమంగా తగ్గుతుండటంతో మార్కెట్కు రోజూ 3వేల క్వింటాళ్లలోపు గూళ్లు వస్తున్నాయి. నాణ్యతను బట్టి బైవోల్టిన్ పట్టు గూళ్లూ కిలో రూ.800 నుంచి రూ.870తో అమ్ముడు పోతోంది.
పట్టుగూళ్ల దిగుబడి నాణ్యతకు చర్యలు
ఇంత కాలం చలి కారణంగా షెడ్లలో వేడి తగ్గుముఖం పట్టింది. దీంతో 40 నుంచి 50 శాతం వరకూ పట్టు గూళ్లు సున్నపుకట్టు వ్యాధి బారిన పడి రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిళ్లు కనీసం 20 డిగ్రీల వేడి తగ్గకుండా చూసుకోవడం ఉత్తమమని పట్టు శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ వాతావరణంలో గుడ్డు అల్లే పురుగు నేత్రికలకు ఎక్కేందుకే 3 రోజులు పడుతుంది. స్పిన్నింగ్కు వచ్చినప్పటి నుంచి గదిలో రాత్రిళ్లు, తెల్లవారుజామున కనీసం 25 డిగ్రీలకుపైగా వేడి ఉండేలా చూసుకోవాంటున్నారు. ఇందుకు గాను షెడ్లలో బొగ్గుల కుంపటి లేదా హీటర్లు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని అంటున్నారు. పట్టు పురుగులు గూళ్లు అల్లేటప్పుడు షెడ్డులో వేడి పెంచకపోతే సున్నపుకట్టు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తేదీ కనిష్టం గరిష్టం సగటు
5 రూ.600 రూ.873 రూ.828
6 రూ.722 రూ.890 రూ.829
7 రూ.568 రూ.902 రూ.828
8 రూ.722 రూ.903 రూ.861
9 రూ.774 రూ.898 రూ.827
10 రూ.569 రూ.876 రూ.820
11 రూ.742 రూ.893 రూ.861
హిందూపురం మార్కెట్లో కిలో
బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు ఇలా..


