కూటమి నేతలను వేంకటేశ్వరస్వామి క్షమించడు
కదిరి టౌన్: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామితో పరాచకాలు ఆడుతున్నారని, ఆ దేవదేవుడు చంద్రబాబుతో పాటు కూటమి నాయకులను క్షమించడని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. మంగళవారం కదిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డు కల్తీ జరగలేదని సీబీఐ సిట్ తెల్చి చెప్పినా చంద్రబాబు, పవన్కళ్యాణ్ కల్తీ జరిగిందని పదే పదే పాట పాడుతుండటం హేయమన్నారు. కల్తీ జరిగింది తిరుమల లడ్డులో కాదు...ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత సంస్థ అయిన హెరిటేజ్లో కల్తీలు జరిగాయన్నారు. అందుకే ఎఫ్ఎస్ఎస్ఐఎ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) జరిమానా విధించిందన్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హెరిటేజ్ సంస్థను రాష్ట్రంలో నిషేధించాలన్నారు. భక్తులు మనోభావాలు దెబ్బతీయటమే లక్ష్యంగా చంద్రబాబు, ఎమ్మెల్యేలు పనిగా పెట్టుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం నియమించిన సీబీఐ సీట్ మీద కూడా వారికి విశ్వాసం లేదన్నారు. కుట్రల ప్రకారం రిపోర్టులు రాకపోయేసరికి న్యాయ వ్యవస్థని తప్పుబడుతున్నారన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల పాపాలకు తగ్గట్టుగా శిక్షలు పడక తప్పదన్నారు. శ్రీశైలంలో శివ భక్తులపైన లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సనాతన సేనాని అని చెప్పుకొనే పవన్కళ్యాణ్ భక్తులపైన లాఠీచార్జీ జరిగితే ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, మండల కన్వీనర్లు రవికుమార్రెడ్డి, అశోక్వర్ధన్రెడ్డి, సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులునాయుడు, యూత్ అధ్యక్షుడు రమేష్యాదవ్, పట్టణ అధ్యక్షుడు బాబా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్న రెడ్డప్ప, సర్పంచ్ హైటెక్ రమణ, ఎంపీటీసీ సభ్యుడు తిమ్మారెడ్డి, నాయకులు ఎహెసాన్, బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో హెరిటేజ్ను నిషేధించాలి
అందులో జరిగిన కల్తీపై సీఎం చంద్రబాబు సమాధనమివ్వాలి
వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్యయకర్త మక్బూల్


