అక్షరాస్యతతోనే ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట
ప్రశాంతినిలయం: ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి ఆర్థిక నేరాలను అరికట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్బీఐ రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంచుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడం తదితర అంశాలపై అవగాహన పెరగాలన్నారు. వారోత్సవాల్లో బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్, డిజిటల్ ఆర్థిక భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డీఎఫ్ఓ చక్రపాణి, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, డీపీఓ సమత, ఐసీడీఎస్ పీడీ ప్రమీళ, ఎల్డీఎం రమణకుమార్, తదితరులు పాల్గొన్నారు.


