రీ సర్వేలో లోటుపాట్లను సరిదిద్దాలి
నల్లమాడ: భూముల రీ సర్వేలో ఏవైనా తప్పొప్పులు దొర్లి ఉంటే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ముందే సరిదిద్దాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని వంకరకుంటలో జరిగిన రీ సర్వే గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గోపేపల్లి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా... అంటూ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మనోజ్ కుమార్, వీఆర్ఓలు పాల్గొన్నారు.
డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో ఇటీవల డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన 16 మందికి పోస్టింగ్ ఇస్తూ అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యు.రమాదేవి (జిల్లా కలెక్టరేట్లోని భూ సంస్కరణల విభాగం), కె.సుశీల (కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం), జి.రమాదేవి (సీపీడీటీ, డి.హీరేహాళ్), బి.షేక్షావలి (ఎంఎల్ఎస్ పాయింట్, ఉరవకొండ ), జె.కేశవరెడ్డి (సీఎస్డీటీ, వజ్రకరూరు), జి.బేబీసురేఖ (సీపీడీటీ, డి.హీరేహాళ్), పి.లక్ష్మికాంత్నాయక్ (ఈడీటీ, గుంతకల్లు), యు.ఆదినారాయణ (ఎంఎల్ఎస్ పాయింట్, గుత్తి), ఎస్.రఘు (డీటీ, బొమ్మనహాళ్), కె.నాగమణి (ఈడీటీ, అనంతపురం అర్బన్), జి.చాంద్బాషా (జేసీ క్యాంపు కార్యాలయం), ఏఎస్ ముక్తియార్ (ఎంఎల్ఎస్ పాయింట్, ఆత్మకూరు) పోస్టింగ్ దక్కించుకున్నారు. అలాగే కె.మహబూబ్బాషా, ఎస్.గణేష్బాబు, పీసీ కుళ్లాయప్ప, కేఆర్ చంద్రశేఖర్లను శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు.
జిల్లావ్యాప్తంగా వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తుంపర వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం నుంచి గోరంట్ల, పుట్టపర్తి, ఓడీసీ, కొత్తచెరువు తదితర మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుకోండి
పుట్టపర్తి టౌన్: సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ ప్రజలకు సూచించారు. పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగను జరుపుకునేందుకు వేలాది మంది స్వగ్రామాలకు వస్తుండటం వల్ల అంతర్రాష్ట్ర రహదారులపై వాహనాల రద్దీ పెరిగిందన్నారు. ప్రజల భద్రత, వాహనాలు రాకపోకలు సాఫీగా సాగేందుకు సరిహద్దు పోలీసు స్టేషన్లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. వాహనదారులు ఏ సమయంలోనైనా ఎలాంటి అవసరమున్నా పోలీస్ శాఖను సంప్రదించాలన్నారు. అలాగే గ్రామాల్లో ఘర్షణలు చెలరేగితే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
‘పుట్బాల్’ విన్నర్స్
నర్మదా వ్యాలీ ఎఫ్సీ
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ ఇన్స్పైర్ ఫుట్బాల్ టోర్నీ విన్నర్స్గా నర్మదా వ్యాలీ ఎఫ్సీ జట్టు నిలిచింది. శనివారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో నర్మదా వ్యాలీ ఎఫ్సీ, మగన్ సింగ్ రాజీవ్ ఎఫ్సీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. నర్మదా వ్యాలీ 2–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అండర్–20 ఉమెన్స్ ఇండియా జట్టు కోచ్ జోయాకిమ్ అలెగ్జాండర్సన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి మరిన్ని టోర్నీలను నిర్వహిస్తామని ఆర్డీటీ ఉమెన్స్ డైరెక్టర్ విశా ఫెర్రర్ పేర్కొన్నారు.
రీ సర్వేలో లోటుపాట్లను సరిదిద్దాలి


