
22 వేల మందికి ‘దుఃఖీభవ’
పుట్టపర్తి అర్బన్: ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల పేరుతో కూటమి సర్కార్ ఆర్భాటంగా శనివారం కార్యక్రమాలు నిర్వహించగా... జిల్లాలోని 22 వేల మంది అర్హులైన రైతులకు పథకం అందని పరిస్థితి నెలకొంది. సుమారు 14 నెలలుగా వేచి ఉన్న రైతులకు శనివారం మొదటి విడత ‘అన్నదాత సుఖీభవ –పీఎం కిసాన్ నిధులు’ జమ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎం కిసాన్ నిధులతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు... తొలి ఏడాది నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పోరాటం, రైతుల ఆందోళనతో దిగివచ్చి రెండో ఏడాది పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే విడతల వారీగా అన్నదాత సుఖీభవ నిధులు అందజేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా తొలి విడతలో రూ.7 వేలు మంజూరు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు జమ చేసినట్లు కొందరు రైతుల సెల్ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. కానీ శనివారం అర్ధరాత్రి వరకూ చాలా మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీంతో రైతులంతా ఒకరికొకరు ఫోన్ చేసుకుని డబ్బులు పడ్డాయా అంటూ ఆరా తీశారు.
డబ్బు జమ కాకపోయినా
మెగా చెక్కు పంపిణీ..
అన్నదాత సుఖీభవ కింద జిల్లాలోని 2,65,040 మంది రైతులకు రూ.132.52 కోట్లు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 2,41,774 మంది రైతులకు 48.35 కోట్లు కలిపి రూ.180.87 కోట్లు విడుదల చేశారు. శనివారం ఉదయం నుంచే పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ, రాప్తాడు, మడకశిర నియోజక వర్గాల్లో ప్రత్యేకంగా అధికారులు, కూటమి నాయకులు, రైతులతో కలిసి ఆర్భాటంగా సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం మెగా చెక్కును అందజేశారు. అయితే నిధులు ఖాతాల్లో జమ చేయకపోయినా మెగా చెక్కు పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది.
సాకులతో కోత..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ అర్హుల్లోని దాదాపు 22,100 మందికి ‘అన్నదాత సుఖీభవ’ అందలేదు. ఇందుకు అధికారులు వివిధ కారణాలు చెబుతున్నారు. ఈ–కేవైసీ చేయించుకోలేదని, ఎన్పీసీఐలో ఇన్ యాక్టివ్ ఖాతాలు తదితర కారణాలతో అర్హులకూ మొండిచేయి చూపారు. ఇంకా ఎవరికైనా ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ నిధులు మంజూరు కాక పోతే ఆదివారం నుంచే ఆర్ఎస్కేల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. వీరికి రెండో విడత అక్టోబర్లో వచ్చే నిధులతో పాటు జమ చేస్తామన్నారు.
అర్హులైనా పథకం అందుకోలేని పలువురు అన్నదాతలు
ఊరూరా సభలతో కూటమి నేతల ప్రచార ఆర్భాటం