
పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
● సబ్జైలు తనిఖీలో
జిల్లా జడ్జి భీమారావు
హిందూపురం: ఆర్థిక ఇబ్బందులతో న్యాయవాదులను నియమించుకోలేని నిరుపేద ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జి ఈ. భీమారావు తెలిపారు. శనివారం ఆయన ఏడీజే కంపల్లె శైలజ, జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్, సీనియర్ సివిల్ జడ్జి డి.వెంకటేశ్వర్లు నాయక్, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యతో కలిసి స్థానిక సబ్జైలును తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఖైదీలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. సబ్ జైలులో ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని సబ్జైలు అధికారి హనుమన్నను ఆదేశించారు. అనంతరం పలువురు ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపారని జిల్లా జడ్జి ఎదుట కొందరు ఖైదీలు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఆవేదన విన్న జడ్జి అరెస్టు సమయంలోనే జడ్జి ముందు పోలీసుల వేధింపుల గురించి చెప్పాలన్నారు. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పినప్పుడే న్యాయ సహాయం అందుతుందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలంతా మార్పు చెంది సమాజంలోకి వెళ్లాలన్నారు. అనంతరం ఆయన స్థానిక సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం భవన సముదాయాన్ని పరిశీలించారు. కోర్టు ఆవరణంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటి నాణ్యత గురించి ఆర్అండ్బీ ఇంజినీర్, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి వెంట న్యాయవాదులు రాజశేఖర్, నవేరా, భరత్ సింహా ఉన్నారు.
ప్రజాప్రతినిధి బంధువునంటూ
బియ్యం దందా!
● టన్ను స్టోర్ బియ్యాన్ని పట్టుకున్న
టూ టౌన్ పోలీసులు
ధర్మవరం: సోమందేపల్లికి చెందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే పార్లమెంటు స్థాయి ప్రజాప్రతినిధి బంధువునని చెప్పుకుంటూ రేషన్ బియ్యం దందా చేస్తున్న విషయం వెలుగు చూసింది. ధర్మవరం పట్టణంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న టన్ను స్టోర్ బియ్యాన్ని టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. స్టోర్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. పట్టణంలోని గొట్లూరుకు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకు వద్ద స్టోర్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. అందులో 20 ప్యాకెట్ల స్టోర్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వీటిని అక్రమ్ అనే వ్యక్తి సోమందేపల్లికి తరలిస్తున్నట్లు తేలింది. ఈ బియ్యాన్ని సోమందేపల్లికి చెందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే సేకరించి బంగారుపేటకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఆర్కే ధర్మవరం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగానూ పెద్దఎత్తున స్టోర్ బియ్యాన్ని సేకరించి.. బెంగళూరు, బంగారుపేటకు తరలిస్తూ భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.

పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం