మరోమారు దగా! | - | Sakshi
Sakshi News home page

మరోమారు దగా!

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

మరోమారు దగా!

మరోమారు దగా!

డీఎస్సీ–1998లో అర్హత సాధించి పోస్టింగులకు నోచుకోని వారు రెండు దశాబ్దాల తర్వాత మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు. వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. ఇప్పుడు బదిలీల విషయంలో మరోమారు అన్యాయం జరుగుతోంది. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు సమీపంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థానాలు లభిస్తే.. ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు కర్ణాటక సరిహద్దున మండలాల్లో మాత్రమే ఖాళీలు చూపిస్తున్నారు. ఈ వయసులో అంతదూరం వెళ్లలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ పట్ల నిర్దయతో వ్యవహరిస్తోందని వాపోతున్నారు.

మడకశిర: ఉపాధ్యాయ పోస్టింగ్‌ నుంచి తదుపరి బదిలీల ప్రక్రియ వరకు డీఎస్సీ–1998 ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు దగాకు గురవుతూనే ఉన్నారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎంతోమంది యువత ఉపాధ్యాయ కొలువుల కోసం డీఎస్సీ రాశారు. అర్హత సాధించిన వారిలో చాలామందికి స్థానాలు కేటాయించలేదు. దీంతో సదరు అభ్యర్థులు కోర్టుకెళ్ళారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలతో ఒక కమిటీ వేసి ఇందులో 75 మంది మాత్రమే అర్హులని తేల్చి.. మిగిలిన డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారు.

పాతికేళ్ల తర్వాత కొలువులు..

డీఎస్సీ–1998లో అన్యాయానికి గురైన 4,272 మంది అభ్యర్థులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో న్యాయం జరిగింది. వారందరినీ మినిమం టైం స్కేల్‌ (ఎంటీఎస్‌) ప్రాతిపదికన నెలకు రూ.32,400 వేతనంతో ఉద్యోగాల్లోకి తీసుకుని, వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. పాతికేళ్ల తర్వాత వారికి కొలువులు దక్కడం.. వారి వయసు 50 ఏళ్లకు చేరుకోవడంతో వీరందరికీ సొంత మండలాలు.. ఖాళీలు లేనిచోట పక్క మండలాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. అలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 520 మంది పనిచేస్తున్నారు.

మళ్లీ అదే కక్ష..

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ చట్టాన్ని తీసుకువచ్చి ఇటీవలనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నిర్వహించింది. అయితే ఈ బదిలీ ప్రక్రియలో ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను చేర్చలేదు. ఎంటీఎస్‌ టీచర్లకు ప్రత్యేకంగా బదిలీ ప్రక్రియ నిర్వహించడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఎంటీఎస్‌ టీచర్లు రెండేళ్ల నుంచి పని చేస్తున్న స్థానాలను కూడా ప్రభుత్వం ఖాళీలుగా చూపించింది. దీంతో ఆ స్థానాలన్నీ రెగ్యులర్‌ టీచర్లతో బదిలీ చేసేశారు. ఎంటీఎస్‌ టీచర్లకు మారుమూలన మండలాలకు బదిలీపై వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఖాళీలన్నీ సరిహద్దు మండలాల్లోనే..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెగ్యులర్‌ టీచర్ల బదిలీలు నిర్వహించిన తర్వాత ఎక్కువగా ఖాళీలు కర్ణాటక సరిహద్దు మండలాల్లోనే విద్యాశాఖ అధికారులు చూపించినట్లు ఎంటీఎస్‌ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఎంటీఎస్‌ టీచర్లకు బదిలీ ప్రక్రియ జరుగనుంది. వీరు ఈ బదిలీల్లో సరిహద్దు మండలాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. శ్రీసత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దులోని అమరాపురం మండలంలో 33, అగళి మండలంలో 20, గుడిబండ మండలంలో 50, రొళ్ళ మండలంలో 50, మడకశిర మండలంలో 4 చొప్పున టీచర్‌ పోస్టులను ఖాళీగా చూపించారు. ఇక అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దు మండలాలైన డీ హీరేహాళ్‌, బొమ్మనహాళ్‌, కణేకల్లు, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో ఎక్కువగా టీచర్‌ పోస్టులు ఖాళీలు చూపించారంటున్నారు. ఈనేపథ్యంలో ఎంటీఎస్‌ టీచర్లు బదిలీల ప్రక్రియలో ఈమండలాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వయసు రీత్యా ఎంటీఎస్‌ టీచర్లు దూర ప్రాంతంలోని మండలాలకు వెళ్ళి విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా వీరికి రూ.32,400 మాత్రమే నెలకు వేతనం అందుతుంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ఎంటీఎస్‌ టీచర్లకు శాపంగా మారింది.

పొమ్మనలేక పొగబెడుతున్న

కూటమి ప్రభుత్వం..

కూటమి ప్రభుత్వం తమకు పొమ్మనలేక పొగబెడుతోందని ఎంటీఎస్‌ టీచర్లు వాపోతున్నారు. దూరప్రాంతాలకు బదిలీ చేస్తే ఉద్యోగాలు వదిలేస్తారని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌జగన్‌ తమకు ఉద్యోగాలిచ్చారనే కక్షతోనే కూటమి ప్రభుత్వం తమ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంటీఎస్‌ టీచర్లకు ఇంతలా అన్యాయం జరుగుతున్నా ఉపాధ్యాయ సంఘాలు నోరెత్తకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని రెగ్యులర్‌ చేయాలని ఎంటీఎస్‌ టీచర్లు కోరుతున్నారు. బదిలీ కౌన్సెలింగ్‌లో తమను దూర ప్రాంతాలకు వేయకుండా సొంత మండలం లేదా పక్క మండలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎంటీఎస్‌ టీచర్లకు ప్రభుత్వం ఏ మేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

నేడు బదిలీల కౌన్సెలింగ్‌

ఎంటీఎస్‌పై పనిచేస్తున్న డీఎస్సీ–2008తో పాటు 1998 ఉపాధ్యాయులకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురంలోని జిల్లా సైన్సు మ్యూజియంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంటీఎస్‌ టీచర్లకు

బదిలీల్లో తీరని అన్యాయం

వైఎస్సార్‌సీపీ హయాంలో

ఉద్యోగాలిచ్చారనే వివక్ష

కర్ణాటక సరిహద్దు మండలాల్లో

ఖాళీలు చూపుతున్నారు

50 ఏళ్లు పైబడిన వాళ్లం..

దూర ప్రాంతాలకు వెళ్లలేం

కూటమి ప్రభుత్వం నిర్దయతో

వ్యవహరిస్తోందని ఆవేదన

అనంతపురం సైన్స్‌ మ్యూజియంలో నేడు బదిలీల కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement