డెంగీ జ్వరాల కలకలం | - | Sakshi
Sakshi News home page

డెంగీ జ్వరాల కలకలం

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

డెంగీ

డెంగీ జ్వరాల కలకలం

బత్తలపల్లి: డెంగీ జ్వరాలు కలకలం రేపుతున్నాయి. బత్తలపల్లిలోని విద్యాధరి పాఠశాల సమీపంలో గల వీరనారప్ప కుమారుడు సాయి మూడు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వర్షాకాలం ప్రారంభమవడంతో సీజన్‌ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నా వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్డీటీ ఆస్పత్రిలో బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు చెందిన చిన్నారులు డెంగీ జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికై నా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉపాధ్యాయుడు అదృశ్యం

కదిరి టౌన్‌: మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయుడు షేక్‌ ఆసిఫ్‌ మహమ్మద్‌ అదృశ్యమయ్యాడు. ఈయన పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసముంటున్నారు. ఈయన ఇతరుల వద్ద రూ.50 లక్షల మేర అప్పులు చేసి, వారికి తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతుండటం గమనించిన భార్య పటాన్‌ జిగిని ఎందు కోసం చేశావని నిలదీసింది. దీంతో శుక్రవారం ఇంటి నుంచి బయల్దేరిన షేక్‌ ఆసిఫ్‌ మహమ్మద్‌ స్కూలుకు వెళ్లలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. చుట్టుపక్కల, స్నేహితుల వద్ద విచారించినా ఆచూకీ లభించకపోవడంతో భార్య శనివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.

ప్రైవేట్‌ టీచర్‌ దుర్మరణం

ముదిగుబ్బ: జొన్నలకొత్తపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన అరుణశ్రీ (36) అనే ప్రైవేటు స్కూలు టీచర్‌ దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుక్కపట్నం మండలం కృష్ణాపురం చర్చికి చెందిన కొందరు మహిళలు శనివారం బొలెరో వాహనంలో అనంతపురం వైపు బయల్దేరారు. జొన్నలకొత్తపల్లి వద్దకు రాగానే టైరు బరెస్టవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పొల్లాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కృష్ణాపురం లయోల పాఠశాల టీచర్‌ అరుణశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఎనిమిది మంది అణ్ణమ్మ, సుజాత, నూనె జీవన, మందల అనూష, ఎడిత్యా శ్రావణి, చింతమొక్కల లావణ్య, కీర్తన శ్రావణి గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

గిన్నిస్‌ రికార్డు కోసం..

గిరిజన పిల్లలకు కష్టాలు

హిందూపురం టౌన్‌: గిన్నిస్‌ రికార్డు కోసం ఎన్డీఏ ప్రభుత్వం గిరిజన విద్యార్థులను విశాఖపట్నం తరలించి, సౌకర్యాలు కల్పించడంలో విఫలమై కష్టాలపాలు చేసిందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ధ్వజమెత్తారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పల కోసం, మోడీ మెప్పు కోసం, మరీ ముఖ్యంగా గిన్నిస్‌ రికార్డు కోసం వేలాదిమంది గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ బస్సులో తరలించడం.. నిద్రించడానికి సరైన సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల పిల్లలను ఈ విధంగా తరలిస్తారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మహిళా సర్పంచులకు

రేపటి నుంచి శిక్షణ

అనంతపురం సిటీ: రాష్ట్ర గ్రామ స్వరాజ్య అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సర్పంచులకు సోమవారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సీఈఓ శివశంకర్‌ శనివారం తెలిపారు. ‘స్థానిక పాలనలో మహిళా సాధికారత’ అనే అంశంపై డివిజనల్‌ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలో మూడు డివిజన్లలో శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. అనంతపురం డివిజన్‌కు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయ క్యాంపస్‌లోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం(డీపీఆర్‌సీ)లో, గుంతకల్లు డివిజన్‌ వారికి గుత్తి మండల పరిషత్‌ కార్యాలయంలో, కళ్యాణదుర్గం డివిజన్‌ వారికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వెల్లడించారు.

డెంగీ జ్వరాల కలకలం 1
1/2

డెంగీ జ్వరాల కలకలం

డెంగీ జ్వరాల కలకలం 2
2/2

డెంగీ జ్వరాల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement