
వివాహిత అనుమానాస్పద మృతి
పామిడి: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పామిడిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఫారెస్ట్ బంగ్లా వద్ద నివాసం ఉంటున్న ఈశ్వర్రెడ్డి, రాజేశ్వరి (28) దంపతులు. వీరికి కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు మూర్తీశ్వర్రెడ్డి సంతానం. ఈశ్వర్రెడ్డి కువైట్లో పనిచేస్తూ వీరిని పోషిస్తున్నాడు. రాజేశ్వరి స్థానిక నాగిరెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బయట పడిన తర్వాత ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా వారిలో మార్పు రాలేదు. యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కువైట్ నుంచి వచ్చిన భర్త శుక్రవారం రాత్రి తిరిగి విధి నిర్వహణ నిమిత్తం వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న భాస్కర్ శనివారం రాజేశ్వరిని ఆటోలో ఎక్కించుకుని వంకరాజుకాలువ గ్రామానికి వెళ్లే దారిలోని మోరీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిమధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ... రాజేశ్వరి రక్తగాయాలతో పడి ఉంది. దీన్ని అటుగా వచ్చిన వారు గమనించి భాస్కర్ను ప్రశ్నిస్తే.. రాజేశ్వరి తన భార్య అని, ఫిట్స్ వచ్చి పడిపోయిందని వారిని నమ్మించాడు. అనంతరం ఆటోలో ఆమెను పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తెచ్చాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా పామిడి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. రాజేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
ఆటో డ్రైవరే హత్య చేశాడు: తమ కుమార్తె రాజేశ్వరిని ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్ హత్య చేశాడని తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, మాధవి ఆరోపించారు. బంధువులతో కలిసివారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. హంతకుడుని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు.