
‘యువత పోరు’తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
పుట్టపర్తి: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేల మంజూరు కోసం ఈ నెల 23న పుట్టపర్తిలో ‘యువత పోరు’ నిర్వహించనున్నారు. యువత భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి, రాష్ట్రకార్యదర్శి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వారు పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు చేసిన మోసాలను ఈ కార్యక్రమం ద్వారా ఎండగడదామన్నారు.
మహిళ ఆత్మహత్య
శెట్టూరు: అడవిగొల్లపల్లికి చెందిన రామాంజినమ్మ (45) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మూడేళ్ల వ్యవధిలో రామాంజినమ్మ భర్త, కుమారుడు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్న రామాంజినమ్మకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. ఉదయం ఎంతసేపటికీ రామంజినమ్మ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. విగతజీవిగా కనిపించింది. వెంటనే కుమార్తె ఉమాదేవికి, పోలీసులకు గ్రామస్తులు సమాచారం చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.