
‘సిద్ధార్థ’లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించడానికి సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచస్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్స్లర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నొవేటివ్ విద్యపై శ్రద్ధ చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25లో విద్యా సంవత్సరానికి సంబంధించి 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్దనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.