ముత్తుకూరు(పొదలకూరు): ఏడు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో పల్లె వీక్షణం కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడారు. సహజసిద్ధంగా ఎరువులను తయారు చేస్తున్న సహాయక గ్రూపులకు తోడ్పాటును అందించనున్నామని వివరించారు. పిడతాపోలూరు ఎస్టీ కాలనీలో లో ఓల్టేజీ సమస్యను అధిమించేందుకు త్రీ ఫేజ్ విద్యుత్ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పల్లె వీక్షణం కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలను రెండు రోజులు ముందే గుర్తించి వాటిని పరిష్కరించేలా తగు చర్యలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో కార్యక్రమాన్ని వచ్చే వారంలో నిర్వహించనున్నామని తెలిపారు. పిడతాపోలూరులో ప్రధాన సమస్యలను పరిష్కరించామని, మంచినీటిని రెండు వారాల్లో అందించనున్నామన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు.. స్వయం సహాయక గ్రూపు సంఘాలకు రూ.నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, డ్రిప్ ఇరిగేషన్, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామస్తులు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ నాగఅనూష, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ సుజాత, వ్యవసాయ, ఉద్యానశాఖల జిల్లా అధికారులు సత్యవాణి, సుబ్బారెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.


