నెల్లూరు(బారకాసు): చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లలితమ్మ విద్యా వికాస పథకం’ కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అత్యంత పేద, అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు www.chaganamlbmtrust.org వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి రూ.25,000ల స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
29.28 శాతం
ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
నెల్లూరురూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 19,74,240 మంది ఓటర్లలో 5,78,067 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 29.28 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7,976 ఫారాలను (0.40) డిజిటలైజ్ చేశారు. కావలి నియోజకవర్గంలో 2,41,702 మంది ఓటర్లకు గానూ 53,132 ఫారాలు పంపిణీ చేశారు. 21.98% నమోదైంది. 733 ఫారాల డిజిటలైజేషన్ (0.30%) జరిగింది. ఆత్మకూరులో 2,17,309 మంది ఓటర్లకు 84,274 ఫారాలు పంపిణీ (38.78%) చేశారు. 378 ఫారాల డిజిటలైజేషన్ (0.17%) జరిగింది. కోవూరులో 2,69,146 మంది ఓటర్లకు గానూ 53,916 ఫారాలు పంపిణీ (20.03%) చేశారు. 1,304 ఫారాల డిజిటలైజేషన్ (0.48%) జరిగింది. నెల్లూరు సిటీ పరిధిలో 2,39,870 మంది ఓటర్లకు 61,037 ఫారాలు పంపిణీ (25.45%) చేశారు. 1,371 ఫారాల డిజిటలైజేషన్ (0.57%) జరిగింది. నెల్లూరు రూరల్లో 2,82,312 మంది ఓటర్లకు గానూ 69,561 ఫారాలు పంపిణీ (24.64%) చేశారు. 1,515 ఫారాల డిజిటలైజేషన్ (0.54%) జరిగింది. సర్వేపల్లిలో 2,34,393 మంది ఓటర్లకు 66,900 ఫారాలు పంపిణీ (28.54%) చేయగా 1,168 ఫారాల డిజిటలైజేషన్ (0.50%) జరిగింది. గూడూరు (ఎస్సీ)లో 2,46,086 మంది ఓటర్లకు గానూ 96,509 ఫారాలు పంపిణీ (39.22%) చేయగా 702 ఫారాల డిజిటలైజేషన్ (0.29%) జరిగింది. ఉదయగిరిలో 2,43,422 మంది ఓటర్లకు 92,738 ఫారాలు పంపిణీ (38.10%) చేశారు. 805 ఫారాల డిజిటలైజేషన్ (0.33%) పూర్తయింది. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు త్వరితగతిన అందజేయాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
పనికి వెళ్లొచ్చేసరికి..
● ఇంట్లో బంగారం చోరీ
నెల్లూరు సిటీ: ఇంటి బయట పూలకుండీలో తాళాలు పెట్టి పనికి వెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం చోరీ చేసిన ఘటన శుక్రవారం జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. పెద్ద చెరుకూరులోని శివాలయం వెనుక వీధిలో శ్రీనివాసులు కుటుంబం ఉంటోంది. అతను బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం శ్రీనివాసులు, అతని భార్య పనికి, కుమార్తె బడికి వెళ్లారు. ఇంటి తాళాలు పూలకుండీలో పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత కుటుంబం వచ్చి తిరిగి వచ్చిచూసేసరికి బీరువాలో రెండున్నర సవర్ల బంగారు కమ్మలు, ఉంగరాలు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి
నెల్లూరురూరల్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో ఎన్.విజయ్కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సమస్యలపై ఉద్యోగ సంఘం నేత బండారుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇంకా ఈహెచ్ఎస్ నెట్వర్క్ ఆస్పత్రులు, ఆరోగ్యమిత్రల జాబితాను ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో ఉంచాలని పలువురు కోరారు. నేతలు గాదిరాజు రామకృష్ణ, పి.కిరణ్కుమార్, ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, కె.సురేష్, టి.మల్లికార్జునరావు, ఏవీ కృష్ణకుమార్, సుధాకర్రెడ్డి, రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో 34.67 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 34.670 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.60
సన్నవి : రూ.30
పండ్లు : రూ.15


