● జిల్లా మలేరియా
నివారణాధికారి సింహాచలం
నెల్లూరు(అర్బన్): మలేరియాతోపాటు డెంగీ, చికున్గున్యా, ఎన్సెఫలోపతి తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం సూచించారు. బుధవారం నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వివిధ సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ నెలలో తొలకరి వర్షాలు పడుతున్నాయన్నారు. ఇందువల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుత్రపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూత్రాలు తెలియచేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆల్ఫాసైఫోమెత్రిన్ లాంటి మందులను స్ప్రే చేసి బ్యాక్టీరియాలను నశింపజేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జయరామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


