● పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు
చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తల్లపనేని జయంతులు నాయుడి నుంచి ప్రాణహాని ఉందంటూ అదే గ్రామానికి చెందిన గట్టుపల్లి జయరామయ్య నాయు డు మంగళవారం చేజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నంబర్ 591లో తనకు పొలం ఉందని, అందులో చెట్లు తొలగించేందుకు కూలీలను తీసుకువెళ్లగా జయంతులు నాయుడు మరి కొంతమంది అటకాయించి చంపేస్తామంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
భార్యపై ఇటుకతో దాడి
● అదనపు కట్నం కోసమే..
నెల్లూరు సిటీ: అదనపు కట్నం కోసం భర్త దాడి చేశాడంటూ ఓ మహిళ నెల్లూరు రూరల్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. మాదరాజుగూడూరు గ్రామంలోని దళితవాడలో పి.ప్రశాంత్, మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అదనపు కట్నం కోసం ప్రశాంత్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను భార్యను తిట్టాడు. అంతటితో ఆగకుండా ఇటుకతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల సహకారంతో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.


