నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడుకు చెందిన కడప శ్రీకాంత్ ఆటో నడుపుతుంటాడు. అతను అదే ప్రాంతానికి చెందిన రేవతితో సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయమై ఆమె భర్త ఐదేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను వదిలేశాడు. శ్రీకాంత్ ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా ఆమె నగరంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ వేరేవారితో ఫోన్లో మాట్లాడుతోంది. దీంతో శ్రీకాంత్కు ఆమె మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో జరిగిన గొడవలో శ్రీకాంత్ ఆమైపె చేయిచేసుకున్నాడు. దీంతో రేవతి నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని అతను అడిగినా ఆమె వినిపించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 9వ తేదీన రేవతి తన తండ్రికి భోజనం ఇచ్చి స్కూటీపై తిరిగి వస్తోంది. శ్రీకాంత్ ఆమెను మాటల్లో దించి పడారుపల్లి చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఫోన్ కాల్ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిని దారుణంగా పొడిచి చంపాడు. ఆ సమయంలోనే అతని కుడితొడకు సైతం గాయమైంది. అక్కడి నుంచి ఆయన నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. గాయాలతో ఉన్న శ్రీకాంత్ను చికిత్స నిమిత్తం పోలీసులు జీజీహెచ్లో చేర్పించారు. 13వ తేదీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు.


