కోవూరు: ఎన్నికల్లో విజయమే పరమావధిగా సూపర్ సిక్స్ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చినా, వాటిని చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కోవూరులో భారీ నిరసన ర్యాలీని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక రుక్మిణి కల్యాణ మండపం నుంచి బజార్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. మెగా డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పి.. దాన్ని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ కాదు.. మేనిప్యులేటర్ అని విమర్శించారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి.. నిజమని నమ్మించడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. కుప్పంలో 30 వేల నకిలీ ఓట్లతో గెలుపొందుతున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్రెడ్డి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల పరిశీలకులు వీరి చలపతి, కొండూరు అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు.


