నెల్లూరు(అర్బన్): జిల్లా మలేరియా నివారణ అధికారిగా మైలపల్లి సింహాచలం సోమవారం సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఫైలేరియా విభాగంలో సీనియర్ ఎంటమాలజిస్ట్గా పనిచేస్తూ పదోన్నతిపై నెల్లూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సింహాచలం మాట్లాడుతూ జిల్లాలో కీటక జనిత నియంత్రణ వ్యాధులైన ఫైలేరియా, మలేరియా, డెంగీ, చికున్గున్యా, మెదడువాపు లాంటి వ్యాధుల నివారణకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 35,193 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు.
కండలేరులో
41.3 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 41.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇన్చార్జి డీటీసీగా
నిరంజన్రెడ్డి
నెల్లూరు(టౌన్): నెల్లూరు జిల్లా రవాణాశాఖ ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్గా చిత్తూరు డీటీసీ నిరంజన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు డీటీసీగా పనిచేస్తున్న బి.చందర్ వ్యక్తిగత కారణాలతో వచ్చే నెల 10వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు నిరంజన్రెడ్డి ఇన్చార్జిగా పనిచేయనున్నారు.


