
అక్రమాలకు మచ్చుతునకలు..
పచ్చ కండువా కప్పుకొంటే అన్నీ సెట్రైట్ అయిపోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచ్లుగా ఉంటే వారి చెక్పవర్ను రద్దు చేస్తూ.. అదే పార్టీ మారితే దీన్ని తిరిగిస్తున్న వైనం కోవూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. తాను అవినీతి రహిత పాలనను అందిస్తానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరచూ చెప్తున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. మండల స్థాయి నేతలు, ఆమె చుట్టూ ఉండే మందీమార్బలం అవినీతిని ప్రోత్సహిస్తున్నారు.
వైఎస్సార్సీపీ సర్పంచ్గా ఉంటే చెక్పవర్ రద్దు
● పార్టీ మారగానే పునరుద్ధరణ
● రేగడిచెలికలో అవినీతికి తమ్ముళ్ల
గ్రీన్సిగ్నల్
● పొంతన లేని
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాటలు
సాక్షి టాస్క్పోర్స్: పచ్చ కండువా కప్పుకొంటే పునీతులవుతారంట. కోవూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అవలంబిస్తున్న తీరును చూస్తుంటే ఇదేదో నిజమనే భావన తలెత్తక మానదు. తమ పార్టీ తీర్థం పుచ్చుకుంటే అవినీతికి పాల్పడేందుకు పచ్చతివాచీ పరుస్తున్నారంటే వారి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదో ఉదాహరణ..
పచ్చ నేతల తీరుకు చక్కటి ఉదాహరణగా కొడవలూరు మండలం రేగడచెలిక పంచాయతీనే చూపొచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉన్న సమయంలో పంచాయతీ నిధులు రూ.పది లక్షలకుపైగా ఆరగించారని రుజువులు చూపించి చెక్పవర్ను రద్దు చేయించారు. వెనువెంటనే ఆయన పచ్చ కండువా కప్పుకోవడంతో పాటు స్థానిక షాడో ఎమ్మెల్యేకు కప్పం కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆయన్ను సచ్ఛీలుడిగా చూపించి రికవరీ లేకుండానే చెక్ పవర్ను మంజూరు చేయించారు. ఆపై పంచాయతీలో ఉన్న రూ.కోటిని ఆరగించేందుకు గ్రీన్ సిగ్నలిచ్చారు. తమ్ముళ్లు చెప్పిందే వేదంగా భావించే డీపీఓ తప్పులపై తప్పులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అంశాలపై కలెక్టర్ సైతం ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు.
రోడ్ల పేరిట దిగమింగి..
గ్రామంలో ప్రధాన వీధులు, అడ్డ వీధులు పది ఉంటాయి. వీటికి రోడ్లను ఏటా వేశామని చూపి బిల్లులను కాజేస్తున్నారు. వేసిన రోడ్డునే రెండు, మూడు సార్లు చూపి బిల్లులనూ చేసుకున్నారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నడిచేందుకు గ్రావెల్ వేయకుండానే కనికట్టు చేసి ఎంబుక్ను సిద్ధం చేశారని సమాచారం. ఈ ఉదంతం అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. మరోవైపు డబ్బులు అవసరమైనప్పుడల్లా మోటార్లు కాలిపోయాయనే సాకు చూపి జేబులు నింపుకోవడం సదరు సర్పంచ్కు షరా మామూలేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
భారీగా వెనుకేసుకొని
సర్పంచ్ అవినీతి చిట్టా వెలుగు చూడటంతో చెక్ పవర్ను రద్దు చేశారు. అయితే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో దీన్ని పునరుద్ధరించారు. సదరు సర్పంచ్ గతంలో జెడ్పీటీసీగా.. ఆయన భార్య ఎంపీపీగా పనిచేశారు. గ్రామాభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సొమ్ముతో దగదర్తి మండలం ఊచగుంటపాళెంలో ఇటీవలే పదెకరాలను కొనుగోలు చేయగా, మరో పదెకరాలకు అడ్వాన్స్ను ఇచ్చారని సమాచారం. గిరిజనులకు అప్పులివ్వడం.. వడ్డీతో సహా కట్టలేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సైతం వెనుకాడరని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
నీరుగారుతున్న విచారణ
మరోవైపు సర్పంచ్ అవినీతి బాగోతంపై కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, విచారణ జరపాల్సిందిగా కావలి డీఎల్పీఓను ఆదేశించారు. అయితే దీన్ని నీరుగారుస్తున్నారని తెలుస్తోంది. అవినీతి స్పష్టంగా కన్పిస్తున్నా, డీఎల్పీఓ నోరు మెదపకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
రేగడిచెలికలో సీమెన్స్ గమేసా, ఇఫ్కో కిసాన్ సెజ్, క్రెబ్స్ తదితర పరిశ్రమలున్నాయి. దీంతో ఈ పంచాయతీకి సాధారణ నిధుల కింద రూ.70 లక్షలొస్తాయి. వీటితో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు. అయితే దీనికి భిన్నంగా తన వ్యక్తిగత అభివృద్ధిపైనే సర్పంచ్ దృష్టి సారించారు.
గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.11 లక్షలను కేటాయించగా, ఇక్కడ రూ.నాలుగు లక్షల్లోపే పనులు జరిగాయని తెలుస్తోంది.
గ్రామంలో డ్రైనేజీ కోసం తవ్విన మట్టిని దేవాలయానికి నాలుగు వైపులా.. పంచాయతీకి నాలుగు వైపులా తోలారు. ఈ మట్టిని బయటి నుంచి కొనుగోలు చేసి రవాణా జరిపామనే రీతిలో దొంగ బిల్లులను సృష్టించి రూ.12 లక్షలను కొల్లగొట్టారనే ఆరోపణలూ ఉన్నాయి.
పంచాయతీలో తాగునీటి బోర్లు కాలిపోయాయని చూపుతూ, గడిచిన ఐదేళ్లలో రూ.40 లక్షల వరకు స్వాహా చేశారని సమాచారం. వీటిని కొనుగోలు చేసిన బిల్లులెక్కడో.. పాత బోర్లను ఎక్కడ ఉంచారో పెరుమాళ్లకే ఎరుక. పాత వాటికి వేలం వేయకుండా.. కొత్త బోర్లను ఏర్పాటు చేయకుండానే నిధులను దోచేశారని గ్రామస్తులే ఆరోపిస్తున్నారు.

అక్రమాలకు మచ్చుతునకలు..

అక్రమాలకు మచ్చుతునకలు..