
ఎలాంటి రుజువుల్లేకుండానే ఆరోపణలా..?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కనుపర్తిపాడు పరిధిలోని సర్వే నంబర్ 295లో గల భూమి అహోబిలం మఠానికి చెందిందనే రెవెన్యూ రికార్డులు వారి వద్ద లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. మినీబైపాస్లోని తన నివాసంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రుజువులుంటే కలెక్టర్ వద్దకెళ్లడమో లేక న్యాయస్థానాలను ఆశ్రయించాలే గానీ ఆశ్రమంలో ఎక్కడో రాసి ఉందనే అంశాన్ని పట్టు కొని తన వద్దకొచ్చి డబ్బులు అడగడం న్యాయం కాదని పేర్కొన్నారు. గతంలో తనను అహోబిలం మఠం సెక్రటరీ వరదరాజన్ కలిశారని, ఏమైనా రుజువులుంటే తీసుకొస్తే పరిశీలిస్తానని చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. తనపై రెండు రోజులుగా నిరాధార ఆరోపణలు చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి పొలం వద్ద బోర్డు పెట్టారని ఆరోపించారు. తహసీల్దార్ ప్రకటన చేయడం.. పొలం వద్దకు వీఆర్వో నేరుగా వెళ్లి.. ఇది వేరొకరిదనేలా బోర్డు నాటి ఫొటోలు తీయించుకోవడాన్ని ఇప్పటి వరకు ఎక్కడా చూడ లేదన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండానే ఇలా వ్యవహరించారని చెప్పారు. సర్వే నంబర్ 295 లోని ఈ పొలాన్ని 2007లో మురళీకృష్ణంరాజు, కిలారి రమేష్బాబు తదితరులు తనకు విక్రయించారంటూ డాక్యుమెంట్లను ప్రదర్శించారు. 1954 నుంచి నేటి వరకు లింక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా, ఎవరి ప్రోద్బలంతోనో అధికారులు తప్పుడు సమాచారాన్ని సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీఆర్వో, అహోబిలం మఠం సెక్రటరీ వరదరాజన్, తన ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై న్యాయస్థానంలో కేసు వేస్తానని స్పష్టం చేశారు. ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. వేరొకరి పొలాలను ఆక్రమించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. నెల్లూరు చెరువు, కనుపర్తిపాడు, పొదలకూరు రోడ్డు, నగర శివారు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని స్వాధీనం చేసుకొని ఇల్లు లేని పేదలకు పంచాలని హితవు పలికారు. విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నేతలు స్వర్ణా వెంకయ్య, పాశం శ్రీనివాస్, హరిబాబుయాదవ్, ఏసునాయుడు, మల్లు సుధాకర్రెడ్డి, మొయినుద్దీన్, శ్రీధర్బాబు, ఆగాల శ్రీనివాస్రెడ్డి, సందానీబాషా తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమించాల్సిన అవసరమే లేదు
వీరిపై కోర్టును ఆశ్రయిస్తా
అహోబిలం మఠం భూములపై
మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి