
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, అండగా మేమున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత భరోసా ఇచ్చారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆమె శనివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. తన తాత కాకాణి రమణారెడ్డి అనుచరుడిగా మాలకొండారెడ్డి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వమొచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అక్రమ కేసులను బనాయించారని ఆరోపించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తమ కుటుంబంతో పాటు గోవర్ధన్రెడ్డి అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తారని చెప్పారు. ప్రజాబలం ముందు అక్రమ కేసులు నిలబడవని తెలిపారు. తన తండ్రిపై బనాయించిన కేసులన్నీ వీగిపోయి తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని నేతలు వెల్మిరెడ్డి సుబ్బారెడ్డి, కోడూరు ఆనందరెడ్డి నివాసాలకెళ్లి యోగక్షేమాలను ఆరాతీశారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, ఎంపీటీసీలు కేతు రామిరెడ్డి, సుబ్బరత్నమ్మ, శ్రీనివాసులు, అంజద్, నేతలు నోటి బాలకొండారెడ్డి, కోడూరు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.