డీఎస్సీ గడువు పొడిగించాలి
● నెల్లూరులో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 387 వినతుల అందజేత
● ప్రత్యేక దృష్టి పెట్టాలన్న కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: ‘సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. కనికరించండి సారూ’ అంటూ అధికారులను మండలాల నుంచి వచ్చిన జనం వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిషార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, డీపీఓ శ్రీధర్రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 387 మంది వినతులను అందజేశారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 131, మున్సిపల్ శాఖవి 42, సర్వేవి 35, పంచాయతీరాజ్ శాఖవి 29, పోలీస్ శాఖవి 62, సివిల్ సప్లయ్స్వి 7 తదితరాలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల విషయంలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ అంశాలపై వినతులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ కోసం..
దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీకి చెందిన చెముడుగుంట వెంకటసుబ్బయ్య కోరారు. 2024లో ఆరోగ్య సమస్య రావడంతో కాలు తీసేశారన్నారు. 70 శాతం డిజేబులిటీ సర్టిఫికెట్ ఉందని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కుటుంబ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన చెందారు.
చర్యలు తీసుకోవాలంటూ..
ఉపాధి పనుల్లో అవకతవకలపై విచారణ జరిపాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రఘు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. 14 మండలాల్లో జరిగిన అవకతవకలపై ఇప్పటి వరకు సిబ్బంది దగ్గర రికవరీ చేయడం గానీ, కేసులు నమోదు చేయడం గాని జరగలేదన్నారు.
సెలవుల్లో ప్రత్యేక తరగతులు
నెల్లూరు నగరంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్మిషన్లు చేస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నెల్లూరు జిల్లా సెక్రటరీ షేక్ షారూక్ వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మస్తాన్, ననీన్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
దారి మూసేశారు
తన మామిడితోటకు దారి ఇవ్వకుండా మూసేశారని బోగోలు మండలం ఎస్వీపాళెం గ్రామస్తుడు ద్వారం వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 88లో 62 సెంట్ల భూమిని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అందులో మామిడి సాగు చేపట్టానన్నారు. ద్వారం శ్రీనివాసులు, నాగరాజమ్మ తోటలోకి దారి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు.
డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ప్రిపరేషన్ సమయం 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచాలని సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కె.సంజయ్కుమార్ మాట్లాడుతూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్, డీఎస్సీ రాయడానికి అవకాశం ఇవ్వాలని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో 45 రోజుల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఈ పరీక్ష కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు సుధీర్, మల్లికార్జునరెడ్డి, ఇర్ఫాన్, రెహమాన్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతిపై విచారణ జరపాలి
మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో తెరతీసిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు డేగా వంశీకృష్ణ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.23 వేలు కేటాయించిందన్నారు. వాస్తవానికి ఒక మెషీన్కు రూ.4,300 మాత్రమే ఖర్చవుతుందన్నారు. శిక్షణలో మహిళలకు మంచినీరు తప్ప ఇంకేమీ ఇవ్వరన్నారు. ఇదంతా టెండర్ దక్కించుకున్న కంపెనీకి దోచిపెట్టేందుకే అని తెలిపారు. కార్యక్రమంలో నేతలు కోవూరు బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్, అరవ సుబ్బయ్య, డేగ శ్రీనివాసులు పాల్గొన్నారు.
డీఎస్సీ గడువు పొడిగించాలి
డీఎస్సీ గడువు పొడిగించాలి
డీఎస్సీ గడువు పొడిగించాలి
డీఎస్సీ గడువు పొడిగించాలి
డీఎస్సీ గడువు పొడిగించాలి


