క్రికెటర్‌ నుంచి చైర్మన్‌ దాకా.. ఎవరీ ఆర్యమాన్‌ బిర్లా? | Who Is Aryaman Birla? New RCB Chairman Also Former Rajasthan Royals Player | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ నుంచి చైర్మన్‌ దాకా.. ఎవరీ ఆర్యమాన్‌ బిర్లా?

Mar 25 2026 10:36 AM | Updated on Mar 25 2026 10:58 AM

Who Is Aryaman Birla? New RCB Chairman Also Former Rajasthan Royals Player

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో(ఐపీఎల్‌) అత్యంత ఆకర్షణీయమైన జట్లలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గతేడాది ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్య హక్కులు తాజాగా చేతులు మారాయి. లీగ్‌ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ (యూఎస్‌ఎల్‌) సంస్థ 1.78 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 16,706 కోట్లు) ఆదిత్యా బిర్లా గ్రూప్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్డ్‌ వెంచర్స్‌, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్‌ సంస్థలకు అమ్మేసింది. 

అయితే ఆర్సీబీ జట్టుకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లాపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్‌ ఆడని ఆర్యమాన్‌ బిర్లా ఇవాళ ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. మరి ఎవరీ ఆర్యమాన్‌ బిర్లా? అతని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమాన్ బిర్లా. 28 ఏళ్ల ఆర్యమాన్ ఒకప్పుడు క్రికెటర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దేశవాళ్లీల్లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతడు.. 9 మ్యాచుల్లో 414 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. 

‘క్రికెట్‌లో మానసిక ఒత్తిడి’ని తట్టుకోలేనంటూ 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఆర్యమాన్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. అయితే అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. తరువాత 2020 సీజన్‌కు ముందు ఆర్యమాన్‌ను రాజస్థాన్‌ రిలీజ్ చేసింది. ఆ తర్వాత దేశవాలీ క్రికెట్‌లో కానీ, ఐపీఎల్‌లో కానీ అవకాశాలు రాలేదు. 

దీంతో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన ఆర్యమాన్‌ బిర్లా ఆ తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచాడు.  హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్న ఆర్యమాన్‌ ఆ తర్వాత బేయర్స్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి గ్లోబల్‌ ఫైనాన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఆర్యమాన్ ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

ఇక ఆర్సీబీని కొనుగోలు చేయడంపై ఆర్యమాన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ‘ఆర్సీబీ తదుపరి దశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అని ఆర్యమాన్ తెలిపాడు. ఈ సందర్భంగా తన పేరుతో ఉన్న ఆర్సీబీ జెర్సీ ఫోటోతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న ఫోటోలను కూడా ఆర్యమాన్‌ షేర్‌ చేసుకున్నాడు.

 చదవండి: విదేశీ వద్దు.. స్వదేశీ కోచ్‌ ముద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement