తమ్ముడి గురువు.. ఆ అక్క మర్చిపోలేదు! | Virat Kohli Sister Wishes Rajkumar Sharma on birthday with old memory Viral | Sakshi
Sakshi News home page

తమ్ముడి గురువు.. ఆ అక్క మర్చిపోలేదు!

Jun 18 2025 6:10 PM | Updated on Jun 18 2025 6:57 PM

Virat Kohli Sister Wishes Rajkumar Sharma on birthday with old memory Viral

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన ఈ రన్‌మెషీన్‌ ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ముఖ్యంగా వన్డేల్లో ఛేజింగ్‌ కింగ్‌గా పేరొందిన కోహ్లి.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు సాధించాడు.

అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఓ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 82 శతకాలు నమోదు చేసిన కోహ్లి.. శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కోహ్లి ఈ స్థాయికి చేరడంలో అతడి కుటుంబంతో పాటు చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ (Rajkumar Sharma)ది కూడా కీలక పాత్ర.

పశ్చిమ ఢిల్లీలోని రాజ్‌కుమార్‌ శర్మ క్రికెట్‌ అకాడమీలో ఓనమాలు దిద్దిన కోహ్లి.. ఆధునిక క్రికెట్‌ యుగంలో మకుటంలోని మారాజుగా ఎదిగాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కోహ్లి ఇప్పటికీ తన చిన్ననాటి కోచ్‌తో కాంటాక్టులో ఉన్నాడు. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై గెలిచిన నేపథ్యంలో శర్మకు ఫోన్‌ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ఇక ఈరోజు రాజ్‌కుమార్‌ శర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా కోహ్లి అక్క భావనా కోహ్లి ధింగ్రా (Bhawna Kohli Dhingra ) తన తమ్ముడి గురువుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోహ్లికి రాజ్‌కుమార్‌ శర్మ మొమెంటో అందిస్తున్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే సర్‌. మీరే నిజమైన మార్గ నిర్దేశకులు.. మెంటార్‌’’ అంటూ విషెస్‌ తెలియజేశారు.

ఈ నేపథ్యంలో కోహ్లి- రాజ్‌కుమార్‌ శర్మల బంధం మరోసారి తెరమీదకు వచ్చింది. కాగా 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పటి వరకు 302 వన్డేలు ఆడి 14181 పరుగులు సాధించాడు.

అదే విధంగా.. 125 టీ20 మ్యాచ్‌లలో కలిపి ఓ శతకం సాయంతో 4188 రన్స్‌ చేశాడు. 123 టెస్టుల్లో కలిపి 9230 పరుగులు సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు.

ప్రస్తుతం వన్డేలతో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్న కోహ్లి ఇటీవలే తన చిరకాల కలను సాకారం చేసుకున్నాడు. ఐపీఎల్‌-2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ గెలవడంతో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. కాగా ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తన జట్టును చాంపియన్‌గా నిలిపేందుకు పదిహేడేళ్లు పట్టింది.

చదవండి: టీ20 ప్రపంచకప్‌-2026 షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement