ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టాపార్డర్లో ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్లో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పటివరకు లీగ్లో నాలుగు మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 266 స్ట్రైక్రేట్తో 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లోనూ వైభవ్ విధ్వంసం కొనసాగింది. కేవలం 26 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. సీజన్లో అతడికి ఇది రెండో అర్థసెంచరీ.
వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు రాజస్తాన్కు కప్ అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వైభవ్ మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూమ్ నుంచి బయల్దేరిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తల్లి బయట నిలబడింది.
పరాగ్ తల్లిని గమనించిన వైభవ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే పరాగ్ తల్లి మాత్రం వైభవ్ను వద్దంటూ వారించి హగ్ చేసుకొని ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం వీడియోలో కనిపించింది. వైభవ్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకున్నారు . ‘అమ్మ ఎవరికైనా అమ్మే’.. ‘పరాగ్ తల్లి పెద్ద మనసుతో వైభవ్ను ఆశీర్వదించడం గొప్ప విషయం’ అంటూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: ‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
Vaibhav Sooryavanshi touched the feet of Riyan Parag's mother and took her blessings before the RCB vs RR match. ❤
Vaibhav Sooryavanshi is a down-to-earth, pure desi boy. pic.twitter.com/Djgqn5mUiY— Sonu (@Cricket_live247) April 10, 2026


