ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీ (PC: BCCI)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా ప్రాచుర్యం పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). భారత్లో టీ20 ఫార్మాట్లో 2008లో మొదలైన ఈ టోర్నీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కులు రూ. 40 వేల కోట్లకు పైగా అమ్ముడుపోవడం ఈ లీగ్కు ఉన్న ఆదరణకు నిదర్శనం. అయితే, ఆరంభంలో ఐపీఎల్ ప్రసారాలకు అసలు బ్రాడ్కాస్టర్లే దొరకలేదట.
ప్రతి చోటా ‘నో’ అనే సమాధానమే
దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలు ఐపీఎల్ ఐడియాను తిరస్కరించారట. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అప్పట్లో బ్రాడ్కాస్టర్లందరి దగ్గరికి మేము వెళ్లాము. కానీ ఒక్కరు కూడా మా మాట వినలేదు.
ప్రతి ఒక్కరి నుంచి ‘నో’ అనే సమాధానమే వచ్చేది. దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలకు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అందులో 90 శాతం మందికి అసలు నేనేం చెబుతున్నానో అర్థమయ్యేదే కాదు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను.
అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసేవారిని మళ్లించాలి
టీవీలో వచ్చే అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసే ప్రేక్షకులను టార్గెట్ చేయాలనుకున్నా. అక్కడే మనం ఊహించనంత డబ్బు ఉంటుంది. నిజానికి భారత ప్రచార మార్కెట్లో ఎనిమిది గంటల స్లాట్ అత్యంతముఖ్యమైనది.
కాబట్టి నైట్ క్రికెట్ వైపు మొగ్గుచూపితే బాగుంటుందనిపించింది. సంగీతం, డ్యాన్సులతో ఎనిమిది గంటలకు మ్యాచ్ ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చాము. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల్ని ఆకర్షించడం మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రేక్షకుల వల్లే డబ్బు ఎక్కువగా వస్తుంది.
భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడంతో
ఇక మొట్టమొదటి, టీ20 ప్రపంచకప్-2007 ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడం మాకు కలిసి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లను హీరోలుగా కీర్తిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశాము. వారిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఐపీఎల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది’’ అని లలిత్ మోదీ స్పోర్ట్స్టార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!


