సానియా జోడి పరాజయం  | Sania Mirza-Ons Jabeur Loses Cincinnati WTA Tournament First Round | Sakshi
Sakshi News home page

సానియా జోడి పరాజయం 

Aug 20 2021 8:37 AM | Updated on Aug 20 2021 8:47 AM

Sania Mirza-Ons Jabeur Loses Cincinnati WTA Tournament First Round - Sakshi

సిన్సినాటి: హార్డ్‌ కోర్ట్‌ సీజన్‌లో కొత్త భాగస్వామితో జత కట్టిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు కలిసి రాలేదు. వెస్టర్న్‌ అండ్‌ సదరన్‌ (సిన్సినాటి) ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లోనే సానియా జోడి పరాజయం పాలైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత సానియాకు అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఇదే తొలి మ్యాచ్‌. వరల్డ్‌ సింగిల్స్‌ 22వ ర్యాంక్‌ అన్స్‌ జబర్‌ (ట్యునీషియా)తో సానియా ఈ సారి బరిలోకి దిగింది. అయితే మొదటి రౌండ్‌లో వెరొనికా కుదెర్మెటొవా (రష్యా) – ఎలినా రైబాకినా (కజకిస్తాన్‌) ద్వయం 7–5, 6–2తో సానియా–జబర్‌ జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా, జబర్‌ కలిసి 4 ఏస్‌లు సంధించగా, 2 డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు.

హైదరాబాద్‌లో  నెహ్రూ హాకీ టోర్నీ 
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ సీనియర్‌ హాకీ టోర్నమెంట్‌కు తొలి సారి హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 1964నుంచి జరుగుతున్న ఈ టోర్నీని తొలిసారి న్యూఢిల్లీ బయట నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 14నుంచి 25 వరకు నగరంలో జరిగే ఈ టోర్నీలో రైల్వేస్, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్, ఇండియన్‌ ఆయిల్, ఎయిర్‌ ఇండియా తదితర ప్రతిష్టాత్మక 16 జట్లు పాల్గొంటాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా యువ హాకీ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చి ఒలింపిక్స్‌ సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నీలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగేలా చేయడంలో నెహ్రూ హాకీ టోర్నీ కీలక పాత్ర పోషించింది. ‘గూంచా గ్రూప్‌’ టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో జేఎన్‌హెచ్‌టీ సొసైటీ అధ్యక్షుడు సుభాష్‌ కపూర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement