
భారత క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెర్మైన్ పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 70 ఏళ్ల నిండిన తర్వాత ఆఫీసు బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది జూలై 19తో బిన్నీ70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలో రోజర్ తనంతట తానే అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు క్రిక్బ్లాగర్కు తెలిపాయి. అతని స్దానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక చైర్మెన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రిక్బ్లాగర్ తమ కథనంలో పేర్కొంది.
ఈ విషయంపై బోర్డులో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 1983 వరల్డ్కప్ విజేతైన రోజర్ బిన్నీ.. 2022లో గంగూలీ స్ధానంలో బీసీసీఐ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక రాజీవ్ శుక్లా చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా గతంలో ఐపీఎల్ చైర్మెన్గా కూడా పనిచేశారు. త్వరలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో శుక్లా ఎంపికను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
చదవండి: IPL 2025 Qualifier 2: పంజాబ్కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?