సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్లో జింబాబ్వేను చిత్తుచేసిన పాకిస్తాన్... తాజా పోరులో శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా 4 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
రావల్పిండి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. జనిత్ లియనగె (38 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కుషాల్ పెరీరా (25; 2 ఫోర్లు, 1 సిక్స్), కమిల్ మిషారా (22; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు.
కెప్టెన్ దసున్ షనక (0) డకౌట్ కాగా... కుషాల్ మెండిస్ (3), కమిందు మెండిస్ (3), పాథుమ్ నిసాంక (17), వణిండు హసరంగ (11) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మొహమ్మద్ నవాజ్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ ఆకట్టుకుంది. 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సయీమ్ అయూబ్ (20; 4 ఫోర్లు), బాబర్ ఆజమ్ (16; 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్లో జింబాబ్వేతో మరోసారి పాకిస్తాన్ తలపడనుంది.
చదవండి: PAK vs SL: తీరు మారని శ్రీలంక.. పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ


