తమిళనాడు చరిత్రలో మరో మైలురాయి.. ఫార్ములా రేస్‌ | Night Race in Chennai Shines with Exciting Formula 4 Results | Sakshi
Sakshi News home page

తమిళనాడు చరిత్రలో మరో మైలురాయి.. ఫార్ములా రేస్‌

Sep 3 2024 9:57 AM | Updated on Sep 3 2024 11:42 AM

Night Race in Chennai Shines with Exciting Formula 4 Results
  • విజయవంతంగా పోటీల నిర్వహణ
  • విజేతలకు బహుమతుల ప్రదానం

సాక్షి, చెన్నై: తమిళనాడు చరిత్రలో ఫార్ములా కార్‌ రేసు –4 మరోమైలు రాయి అని క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఫార్ములా కార్‌ రేసు పోటీలు చెన్నైలో విజయవంతంగా జరిగాయి. బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. వివరాలు.. తమిళనాడు క్రీడలశాఖ, తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సహకారంతో ప్రొమోటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌ (ఆర్‌పీపీఎల్‌) నేతృత్వంలో చెన్నై వేదికగా భారతదేశంలోనే ప్రపథమంగా నైట్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌ పందేంగా శని, ఆదివారాలలో ఫార్ములా కార్‌ రేస్‌ – 4 పోటీలు జరిగాయి. 

చెన్నై ఐల్యాండ్‌ గ్రౌండ్‌ మైదానం చుట్టూ ఉన్న 3.5 కి.మీ దూరంలోని అన్నాసాలై, శివానందసాలై, నేప్పియర్‌ వంతెన మీదుగా పోటీలు హోరెత్తాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర నగరాలకు చెందిన జట్టులకు చెందిన 24 మంది క్రీడాకారులు కార్‌ రేసింగ్‌లో దూసుకెళ్లారు. 

ఇందులో ఆరుగురు మహిళా డ్రైవర్లు సైతం ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. వినోదం, సాహసంతో కూడిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర వాసులు ఈ పోటీలను తిలకించేందుకు వీలుగా అనేక చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తుది పోటీలు ఇండియన్‌ చాంపియన్‌ షిప్, ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ కేటగిరీలలో పోటాపోటీగా జరిగాయి. జేకే టైర్‌ జూనియర్‌ జాతీయ పోటీలు, సాహస కార్యక్రమాలు నిర్వహించారు. 

విజయవంతంగా.. ఫార్ములా రేస్‌ విజయవంతమైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో విజేతలకు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు, నిర్వాహకులు, సినీ సెలబ్రటీలు బహుమతులను ప్రదానం చేశారు. ఫారుమలా – 4 ఛాంపియన్‌ షిప్‌లో ఆ్రస్టేలియాకు చెందిన కొచ్చి టీం క్రీడాకారుడు హగ్‌ బర్టర్, బెంగాళ్‌ జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు రుహాన్‌ అల్వ, బెంగళూరు జట్టుకు చెందిన భారత క్రీడాకారుడు అభయ్‌ మోహన్‌ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.

 రేస్‌ –2లో విజేతలుగా హైదరాబాద్‌ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా క్రీడాకారుడు అకిల్‌ అలీబాయ్, అహ్మదా బాద్‌ జట్టుకు చెందిన భారత డ్రైవర్‌ దివ్య నందన్, బెంగళూరు జట్టుకు చెందిన భారత డ్రైవర్‌ జడిన్‌ పరియట్‌ తొలి మూడుస్థానాలను దక్కించుకున్నారు. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్, జేకే టైర్‌ జూనియర్‌ పోటీలలోనూ విజేతలకు బహుమతులను అందజేశారు. 

ఈ పోటీల విజయవంతం గురించి క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. చెన్నైలో ఈ పోటీలు విజయవంతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నిర్వాహకులు, అధికారులు, మద్దతు ఇచ్చిన చెన్నై నగర ప్రజలు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పోటీలు తమిళనాడు చరిత్రలో మరో మైలురాయిగా నిలిచి పోతాయని అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన సీఎం స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పోటీలలో విజేతలు, కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ సీఎం స్టాలిన్‌ సైతం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement