సింధు పరాజయం  | Mixed results for Indian shuttlers in quarter finals | Sakshi
Sakshi News home page

సింధు పరాజయం 

Mar 9 2024 2:05 AM | Updated on Mar 9 2024 2:05 AM

Mixed results for Indian shuttlers in quarter finals - Sakshi

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు క్వార్టర్‌ ఫైనల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లగా, రెండు వరుస ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధుకు క్వార్టర్‌ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 24–22, 17–21, 18–21తో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ యూ ఫె (చైనా) చేతిలో పోరాడి ఓడింది.

గంటా 32 నిమిషాల పాటు భారత స్టార్‌ తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యూ ఫెకు దీటుగా కోర్టులో శ్రమించడంతో ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో తొలిగేమ్‌ హోరాహోరీగా సాగింది. 22–22 వద్ద సింధు క్రాస్‌కోర్టు షాట్లతో విరుచుకుపడి తొలిగేమ్‌ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సరీ్వస్‌ వైఫల్యంతో వెనుకబడిన సింధు గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.

కానీ చైనా ప్రత్యర్థి పైచేయి సాధించడంతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–13తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్‌ జొమ్‌కొ–కిటినుపాంగ్‌ కెడ్రెన్‌ జోడీపై విజయం సాధించింది.  పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ కూడా సెమీస్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో లక్ష్య 19–21, 21–15, 21–13 స్కోరుతో లో కీన్‌ యూ (సింగపూర్‌)ను ఓడించాడు.

Advertisement
 
Advertisement
Advertisement