నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: ల‌క్ష్య‌సేన్ | Lakshya Sen Reveals Why He Lost Momentum To Finish 4th In Paris Olympics Badminton | Sakshi
Sakshi News home page

నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: ల‌క్ష్య‌సేన్

Aug 6 2024 8:49 AM | Updated on Aug 6 2024 10:08 AM

Lakshya Sen Reveals Why He Lost Momentum To Finish 4th In Paris Olympics Badminton

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంట‌న్ సింగిల్స్   సెమీఫైన‌ల్లో ఓట‌మి చ‌విచూసిన ల‌క్ష్య‌సేన్‌.. కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిరాశ‌ప‌రిచాడు. సోమ‌వారం జ‌రిగిన కాంస్య ప‌త‌క పోరులో  21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ల‌క్ష్య‌సేన్‌ ఓడిపోయాడు. 

71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ తొలి గేమ్‌ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దీంతో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భార‌త క్రీడాకారులు ఇంటిముఖం ప‌ట్ట‌డం ఇదే తొలి సారి. 

2012 లండన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం లక్ష్య‌సేన్ స్పందించాడు.

"ఏం తప్పు జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేను మ్యాచ్‌ను బాగా మొదలు పెట్టినా దానిని కొనసాగించలేకపోయాను. ఫలితంతో చాలా నిరాశ చెందాను. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. రెండూ కీలక మ్యాచ్‌లే. కానీ రెండూ ఓడిపోయాను.

కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను చాలా తప్పులు చేశాను. నా ప్రత్యర్థి రెండో గేమ్‌ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటను ఆపి చికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. అయితే మ్యాచ్‌ ఫలితానికి దీనికి సంబంధం లేదని ల‌క్ష్య‌సేన్ పేర్కొన్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement