Ireland, PNG and Scotland Have Locked Their Spots in ICC Men's T20 World Cup 2024 - Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ 2024కు కొత్తగా అర్హత సాధించిన మూడు జట్లు ఇవే..!

Jul 31 2023 8:42 PM | Updated on Jul 31 2023 8:46 PM

Ireland, PNG And Scotland Have Locked Their Spots In ICC Mens T20 World Cup 2024 - Sakshi

వచ్చే ఏడాది వెస్టిండీస్‌, యూఎస్‌ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు కొత్తగా మూడు జట్లు అర్హత సాధించాయి. యూరప్‌, ఈస్ట్‌ ఏసియా పసిఫిక్‌ రీజియన్స్‌ క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ జట్లు తాజాగా ప్రపంచకప్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనే మెగా టోర్నీలో పై పేర్కొన్న మూడు దేశాలు 13, 14, 15వ జట్లుగా బరిలోకి దిగుతాయి.  

టీ20 వరల్డ్‌కప్‌ 2024 నిబంధనల ప్రకారం​.. తొమ్మిదో ఎడిషన్ ప్రపంచకప్‌ కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి.

మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. తాజాగా ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ 13, 14, 15 స్థానాలకు క్వాలిఫై కాగా.. మరో 5 స్థానాల కోసం వివిధ రీజియన్లలో పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఆసియా క్వాలిఫయర్‌-బి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మలేసియా, థాయ్‌లాండ్‌, భూటాన్‌, చైనా, మయన్మార్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement