ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రంజుగా సాగుతుంది. మూడు బెర్త్లు ఖరారైనా, నాలుగో బెర్త్పై చివరి రెండు లీగ్ మ్యాచ్ల వరకు సందిగ్దత నెలకొంది. తొలి మూడు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ దక్కించుకోగా.. నాలుగో బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, కేకేఆర్ పోటీపడుతున్నాయి. ఈ బెర్త్ ఏ జట్టుతో ఇవాళ తేలిపోతుంది.
నాలుగో బెర్త్ కోసం రేసులో ఉన్న మూడు జట్లలో ముందుగా పంజాబ్ అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు ఆడాల్సిన లీగ్ మ్యాచ్లన్నీ పూర్తి చేసుకొని తమ అదృష్టాన్ని ఇతర జట్ల జయాపజయాలపై వదిలేసింది. నిన్న (మే 23) లక్నోపై గెలుపుతో రేసులో నిలబడిన ఈ జట్టు.. ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలిచిందా, పంజాబ్తో పాటు కేకేఆర్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి, ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్తో పోటీకి సిద్దమవుతుంది.
ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిందా.. రాత్రి కేకేఆర్-ఢిల్లీ మ్యాచ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్, కేకేఆర్ మాత్రమే ఉంటాయి.
రాత్రి జరిగే మ్యాచ్లో ఢిల్లీ చేతిలో కేకేఆర్ ఓడితే, పంజాబ్ దర్జాగా ప్లే ఆఫ్స్కు (మధ్యాహ్నం రాజస్థాన్ ఓడిన పక్షంలో) చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే అప్పుడు నెట్ రన్రేట్ (కేకేఆర్, పంజాబ్కు చెరి 15 పాయింట్లు ఉంటాయి) కీలకమవుతుంది. ఏ జట్టుకు మెరుగైన రన్రేట్ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్తో పోటీకి సిద్దమవుతుంది.
కేకేఆర్కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే ముందుగా ముంబై చేతిలో రాజస్థాన్ ఓడాలి. ఆపై ఢిల్లీతో మ్యాచ్లో భారీ తేడాతో గెలవాలి. ఎంత తేడాతో గెలవాలనే దానిపై ఓ వివరణ (ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 200 పరుగుల ఆధారంగా).
* ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 77 పరుగుల తేడాతో.
* ఛేజింగ్ చేయాల్సి వస్తే 12.1 ఓవర్లలోపే చేధించాలి.
* స్కోర్లు సమం అయిన తర్వాత సిక్సర్తో మ్యాచ్ ముగిస్తే 12.4 ఓవర్ల వరకు అవకాశం ఉంటుంది.
ఈ సమీకరణల్లో ఏదీ సాధించలేకపోతే.. ముంబై రాజస్థాన్ను ఓడించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.


