
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. వాఖండే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది.
ముంబై బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడినప్పటికి కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్బతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 56) టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.
ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. వాంఖడేలో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ విజయం సాధించడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కోహ్లి, పాటిదార్ హాఫ్ సెంచరీలు
ఈ మ్యాచ్లో ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.