
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. నిన్న హోం గ్రౌండ్ వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్లో ముంబై గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే గెలుపు దరి చేరిన సమయంలో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్సీబీ ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 18, 19 ఓవర్లలో ప్రమాదకరంగా కనిపిస్తున్న తిలక్ (భువీ), హార్దిక్ను (హాజిల్వుడ్) ఔట్ చేశారు. చివరి ఓవర్లో కృనాల్ చెలరేగి (6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు) లాంఛనంగా మ్యాచ్ను ముగించాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ క్రమంలో గత మ్యాచ్లో (లక్నో) తిలక్ను రిటైర్డ్ ఔట్గా వెనక్కు పంపడంపై అసలు విషయాన్ని బయటపెట్టాడు. లక్నోతో మ్యాచ్కు ముందు రోజు తిలక్ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ సమయంలో తిలక్ను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పంపడం కేవలం వ్యూహం మాత్రమే కాదని వివరించాడు. గాయం కారణంగా తిలక్ షాట్లు ఆడలేక అసౌకర్యంగా కనిపించాడన్నాడు. అందుకే అతన్ని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పంపి సాంట్నర్ను బరిలోకి దించామని పేర్కొన్నాడు.
కాగా, లక్నోతో మ్యాచ్ ముగిశాక హార్దిక్ తిలక్ గాయం విషయాన్ని చెప్పలేదు. భారీ షాట్లు ఆడే ఆటగాడు కావాలనే ఉద్దేశంతో సాంట్నర్ను బరిలోకి దించినట్లు తెలిపాడు. సాంట్నర్ను భారీ హిట్టర్గా చెప్పుకొచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో అతనికి స్ట్రయిక్ ఇవ్వకపోవడం కొసమెరుపు.
ఆ మ్యాచ్లో ముంబై లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీతో మ్యాచ్ తరహాలోనే ఆ మ్యాచ్లోనూ ముంబై విజయతీరాల వరకు చేరి గెలుపు సాధించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లో హార్దిక్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికి ముంబై 5 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించి ఈ సీజన్లో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఓటమి ఎరుగని ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుంది.