టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్‌ | IND-W Vs SA-W 2nd ODI: Arundhati Reddy Made Her ODI Debut For Team India | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్‌

Jun 19 2024 2:44 PM | Updated on Jun 19 2024 2:59 PM

IND-W Vs SA-W 2nd ODI: Arundhati Reddy Made Her ODI Debut For Team India

హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్‌, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేసింది. మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్‌ 19) జరుగుతున్న మ్యాచ్‌తో అరుంధతి వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన అరుంధతికి క్యాప్‌ అందించి టీమ్‌లోకి ఆహ్వానించింది. 2018లోనే టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 26 ఏళ్ల అరుంధతి.. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. 

రైట్‌ ఆర్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌, రైట్‌ హాండ్‌ బ్యాటర్‌ అయిన అరుంధతి.. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2021లో ఆడింది. టీ20ల్లో 26 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అరుంధతి 18 వికెట్లు తీసి, 73 పరుగులు చేసింది.  

కాగా, మూడు వన్డేలు, ఒక​ టెస్ట్‌, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా మహిళల క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డే సిరీస్‌ ప్రారంభమైంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

బెంగళూరు వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. 20 పరుగులు చేసి షఫాలీ వర్మ ఔట్‌ కాగా.. స్మృతి మంధన (19), దయాలన్‌ హేమలత (7) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వర్మ వికెట్‌ మ్లాబాకు దక్కింది.

తుది జట్లు..

భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభన

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ.
 

Advertisement
 
Advertisement
Advertisement