IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌ | IND VS ENG 1st TEST: PANT BECOMES THE FIRST ASIAN WK BATTER TO SCORE HUNDREDS IN BOTH INNINGS | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌

Jun 23 2025 8:33 PM | Updated on Jun 23 2025 9:08 PM

IND VS ENG 1st TEST: PANT BECOMES THE FIRST ASIAN WK BATTER TO SCORE HUNDREDS IN BOTH INNINGS

టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ టెస్ట్‌ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్‌ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పంత్‌ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో ​15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్‌ పటిష్ట స్థితికి చేరింది.

నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్‌ రాహుల్‌ 120, కరుణ్‌ నాయర్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌ 4, సాయి సుదర్శన్‌ 30, శుభ్‌మన్‌ గిల్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్‌ బషీర్‌, బెన్‌ స్టోక్స్‌ తలో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్‌ (106) సెంచరీతో కదంతొక్కగా..  హ్యారీ బ్రూక్‌ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్‌ డకెట్‌ 62, జేమీ స్మిత్‌ 40, క్రిస్ వోక్స్‌ 38 రాణించడంతో  ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement