సెయింట్ కిట్స్ వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0 తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35.4 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది.
అసీస్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు పడగొట్టి కరేబియన్ జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు గార్డనర్ రెండు, హామిల్టన్, కారీ, మెక్గ్రాత్ తలా వికెట్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో చినెల్లే హెన్రీ (42 పరుగులు), హేలీ మాథ్యూస్(34 పరుగులు) రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్(68), ఎలీస్ పెర్రీ(33) నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించారు. విండీస్ బౌలర్లలో అష్మిని మునిసర్ ఒక్క వికెట్ పడగొట్టింది.
కాగా అంతకుముందు టీ20 సిరీస్ను కూడా ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం పర్యటనలో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్


