పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టుకు ఊరట లభించే విజయం దొరికింది. తొలుత జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఆ జట్టు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (అక్టోబర్ 29) జరిగిన రెండో టీ20లో విండీస్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలిక్ అథనాజ్ (52), షాయ్ హోప్ (55) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీసః ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, నసుమ్ అహ్మద్, రిషద్ హొస్సేన్ తలో 2 వికెట్లతో సత్తా చాటారు.
అనంతరం స్వల్ప స్కోర్ను విండీస్ బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. అకీల్ హోసేన్, రొమారియో షెపర్డ్ తలో 3, హోల్డర్ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తంజిద్ హసన్ తమీమ్ (61) ఒంటరిపోరాటం వృధా అయ్యింది. నామమాత్రపు మూడో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 31న జరుగనుంది.


