కోటా కినబాలు (మలేసియా): ఈస్ట్ బెంగాల్ మహిళల ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి అతిపెద్ద విజయం సాధించిన భారత క్లబ్ జట్టుగా ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ రికార్డు నెలకొల్పింది. ఆసియా ఫుట్బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) చాంపియన్స్ లీగ్ ప్రిలిమినరీ స్టేజ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ 12–0 గోల్స్ తేడాతో రోవర్స్ ఎఫ్సీ (గ్వామ్)పై గెలుపొందింది.
1985–86 ఆసియా క్లబ్ చాంపియన్షిప్లో ఈస్ట్ బెంగాల్కే చెందిన పురుషుల జట్టు 9–0 గోల్స్ తేడాతో వాలెన్సియా క్లబ్పై సాధించిన విజయం రెండో స్థానానికి చేరింది. ఈస్ట్ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్యతోపాటు అస్తమ్ ఒరావొన్, అబిగైల్ అంట్వీ, సులంజన రౌల్, శిల్కీ దేవి, అంజూ చాను ఒక్కో గోల్ చేశారు. ప్రియాంక దేవి , ఒలీవియా అనోకీ, అబెకా రెండు గోల్స్ చొప్పున సాధించారు.


