విశ్వక్రీడల్లోనూ క్రికెట్‌.. ఫార్మాట్‌, జట్లు తదితర వివరాలు | Cricket In 2028 Olympics: 6 Team T20 Event Confirmed Check Details | Sakshi
Sakshi News home page

Cricket In 2028 Olympics: విశ్వక్రీడల్లోనూ క్రికెట్‌.. ఫార్మాట్‌, జట్లు తదితర వివరాలు

Apr 10 2025 10:25 AM | Updated on Apr 10 2025 11:39 AM

Cricket In 2028 Olympics: 6 Team T20 Event Confirmed Check Details

నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. 

పదిహేను మంది సభ్యులతో
ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రికెట్‌ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఒలింపిక్స్‌కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.

ర్యాంకింగ్స్‌ ఇలా
ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మెన్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, టీమిండియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్‌ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. 

కోహ్లి, రోహిత్‌ లేకుండానే..?!
టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇక రోహిత్‌ వారసుడిగా టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్‌ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్‌ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్‌నెస్‌ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.

చదవండి: సంజూ శాంసన్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement