షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ | BCCI issues show cause notice to RR manager Romi Bhinder | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ రాయల్స్‌ మేనేజర్‌కు బీసీసీఐ షోకాజు నోటీసులు

Apr 14 2026 1:19 PM | Updated on Apr 14 2026 1:38 PM

BCCI issues show cause notice to RR manager Romi Bhinder

రోమీతో వైభవ్‌ (PC: X)

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మేనేజర్‌ రోమీ భిందర్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్‌లో మొబైల్‌ ఫోన్‌ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.

వైభవ్‌ సూర్యవంశీ కూడా...
కాగా శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రోమీ భిందర్‌ మొబైల్‌ ఫోన్‌ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. 

వీరిద్దరు మొబైల్‌లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్‌కు మొబైల్‌ ఫోన్‌ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్‌లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.

తొలి ఓటమి
ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ జోరుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.

నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్‌రైజర్స్‌. లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. 

సన్‌రైజర్స్‌ బౌలర్‌ ప్రఫుల్‌ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ (0), లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (0), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (4)లను అవుట్‌ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాయల్స్‌ నాలుగు గెలిచింది. 

చదవండి: సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement