న్యూస్రీల్
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విషయంలో ఓటర్లకు సవాలక్ష సందేహాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడం.. అందుకు అవసరమైన వివరాలు లభించక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలను పూరించేందుకు నిరక్షరాస్యులు ఇతరులపైనే ఆధారపడుతున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఫారాలు అందజేయడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 99.74శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. 14.27శాతం మందే ఫారాలను నింపి అధికారులకు ఇచ్చారు. ఎస్ఐఆర్పై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – సాక్షి, సిద్దిపేట
కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసేందుకు 1,157 మంది బీఎల్ఓలను, సూపర్వైజర్లు 133 మంది, ఏఈఆర్ఓలు 33 మందిని నియమించారు. ఇంటింటికీ తిరిగి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. ఓటర్లు ఫారాలు నింపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా తప్పుగా నమోదు చేస్తే ఓటు హక్కు రద్దయితే తమనే బాధ్యులు చేస్తారని కొందరు నింపేందుకు ముందుకు రావడం లేదు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు.
వివరాలపై సందేహాలు
ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకాలంలో ఏ వివరాలు రాయాలన్న సందేహం చాలా మందిని వెంటాడుతోంది. దీనిపై స్పష్టత ఇచ్చే వారు లేరు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలే సర్లో కీలకంగా మారాయి. నాటి వివరాలు అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న వారి ఫారాలు నింపడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక 2002 నాటికి ఓటు హక్కులేని వారు, లేదా ఆ తర్వాత జన్మించిన వారి విషయాల్లోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 24 ఏళ్ల కిందటి వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు సేకరించడం సవాలుగా మారింది. నాటి పోలింగ్కేంద్రం నంబర్, ఓటరు సీరియల్ నంబర్, ఏపిక్ కార్డు నెంబర్లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
డిజిటలైజేషన్ 14.27శాతమే
జిల్లా వ్యాప్తంగా 9,92,967 మంది ఓటర్లుండగా అందులో 9,90,396 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. 99 శాతం పంపిణీ పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి డిజిటలైజేషన్ 14.27శాతమే అయ్యింది. అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 10.24 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2002 ఓటర్ల వివరాలు అందజేస్తేనే సర్ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో ఓటర్ల వివరాలు తెలుసుకుంటూ ఫారాలు నింపుతున్న బీఎల్ఓలు
నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ నింపి ఇచ్చినవారు
హుస్నాబాద్ 2,54,543 2,53,226 53,795
సిద్దిపేట 2,44,507 2,44,135 25,049
దుబ్బాక 2,04,664 2,04,487 25,980
గజ్వేల్ 2,89,253 2,88,548 36,911
మొత్తం 9,92,967 9,90,396 1,41,735
బీఎల్ఓల తిప్పలు
ఆరుబయటే ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఎల్ఓలు ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపుతూ ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. కాగా మండల పరిధిలోని మల్లారంలో మంగళవారం బీఎల్ఓలు ఆరుబయట ఫారాలు నింపుతూ ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు ప్రక్రియ చేపట్టవద్దని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో ఆరుబయటే ఫారాలు నింపుతూ.. వర్షానికి తడుస్తూ ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సలీమ్ను అడుగగా గ్రామ పంచాయతీల్లో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. మల్లారం విషయం తన దృష్టికి రాలేదన్నారు. అలాంటివి జరగకుండా చూస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 99.74శాతంఫారాల పంపిణీ
2002 ఓటర్ల వివరాలు లభించక అవస్థలు


