హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. ఏఐలో నాలుగు సీట్లు, ఈఈఈలో రెండు సీట్లు, సివిల్లో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణణ సాధించిన విద్యార్థులు పాలిటెక్నిక్లో ప్రవేశం పొందుటకు అర్హులన్నారు. జూలై 8న ఒరిజనల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
జిల్లా స్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి జెండా ఊపి ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 విభాగాల్లో మహిళలు, పురుషులకు పరుగు, జంప్స్, వివిధ రకాల త్రోస్ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అత్యంత ప్రతిభ చూపిన వారు ఈనెల 12న పటాన్చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు మరమ్మతులకు చర్యలు
వర్గల్ను సందర్శించిన ఆర్అండ్బీ ఎస్ఈ
వర్గల్(గజ్వేల్): గతుకులమయమైన వర్గల్ రోడ్డును మంగళవారం ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సారంగపాణి పరిశీలించారు. సర్పంచ్ జయభారతి, డిప్యూటీ ఈఈ రేణుక, ఏఈఈ చంద్రశేఖర్తో కలిసి క్షేత్రస్థాయిలో రోడ్డుపై గోతులను, దెబ్బతిన్న రోడ్డును పరిశీలన చేశారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గోతులు దాటిన నిర్లక్ష్యం–రోడ్డెక్కిన నిరసనగళం’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెల్సిందే. ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, డిప్యూటీ ఈఈ, ఏఈలకు పలుసూచనలు చేశారు. రోడ్డు బాగుకోసం చర్యలు చేపడతామని, ఉన్నతాధికారులకు ఎస్టిమేట్లు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా రోడ్డు మీద గోతులను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించారు.
డీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్రెడ్డి
తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్పల్లికి చెందిన కూచి మహిపాల్రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తాను పార్టీకి అందించిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


