
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
● అధికారులకు కలెక్టర్ హైమావతి హెచ్చరిక ● లక్ష్మీనగర్, మిరుదొడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై ఏదీ?
మిరుదొడ్డి(దుబ్బాక): విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హైమావతి అధికారులను హెచ్చరించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లక్ష్మీనగర్లో, మిరుదొడ్డిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ శరవేగంగా నిర్మాణాలను చేపట్టాని లబ్ధిదారులకు సూచించారు. త్వరగా పూర్తి చేసిన ఇంటి నిర్మాణాలకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో విడతల వారీగా నిధులు జమ అవుతాయని తెలిపారు. అనంతరం మిరుదొడ్డిలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య పరీక్షలను, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో ధ్వంసమైన గ్రౌండ్ ఫ్లోర్ను బాగు చేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి పీఏసీఎస్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాగు విస్తీర్ణం మేరకు రైతులకు యూరియా పంపిణీ చేయాలన్నారు. ఎరువు లను అక్రమంగా విక్రయించినా, యూరియా కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళను సందర్శించారు. ఆమె వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ లింగాల వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
దుబ్బాకరూరల్: మండలంలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వేడి చేసిన నీటినే తాగాలన్నారు. అనంతరం అదే గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.
కుకునూరుపల్లిలో ఆకస్మిక తనిఖీ
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24 గంటల వైద్య సేవలందించే ఆస్పత్రిలో రాత్రి వేళ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఆస్పత్రి ఉందని 24 గంటల పాటు వైద్యం అందేలా చూసుకోవాలన్నారు. సీజన్ వ్యాదులు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
దుబ్బాక: లిక్కర్ మీదున్న శ్రద్ధ పాఠశాలలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరధిలోని దుంపలపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారించడమేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. లిక్కర్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారే తప్ప పాఠశాలలను పట్టించుకోవడంలేదని అన్నారు. పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. గతంలో దుబ్బాక మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐడీసీ కింద 20 కోట్లు మంజూరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.
‘కూడవెల్లి’ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
దుబ్బాకరూరల్: అక్బర్పేటభూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆలయ అభివృద్ధిపై బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు