
30వరకు దరఖాస్తుల స్వీకరణ
ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎప్సీఆర్ఐ)లో 2025–26 సంవత్సరానికి గానూ బీఎస్సీ (హానర్స్) పారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల డీన్ ఎస్జె.ఆశ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏపీసీఈటీ ర్యాంకుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తులుకు ఈ నెల 30వ వరకు గడువు అన్నారు. ప్రవేశం కొరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400, మిగతా వారు రూ.600 చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు.
20 మందికి ఉపాధి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం 50 మంది విద్యార్థులు హాజరుకాగారవగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 20 మందిని ఎంపిక చేశారు. అనంతంర రీసోర్స్ పర్సన్ దుర్గాప్రసాద్ విద్యార్థులకు ఫార్మా రంగంలో గల అవకాశాలను గురించి వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హైదరాబాద్ జీడిమెట్ల రిడాక్స్ ల్యాబ్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. తద్వారా కళాశాల విద్యార్థులకు పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు సులువుగా పొందే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కెమిస్ట్రీ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ రవి, భాస్కర్, సుమలత, ఆంజనేయులు, శ్రీనివాస్, మనోహర్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.
ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలి
జల సాధన సమితి డిమాండ్
తొగుట(దుబ్బాక): ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువుల్లోకి నీటిని విడుదల చేయాలని జల సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుడికందులలో ఆయా గ్రామాల రైతులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సాగునీరు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. మండలంలో 50 టీఎంసీల సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించినప్పటికి తమ భూమికి చుక్క నీరు అందని దుస్దితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే యాసంగి పంటలకు మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. లేకుంటే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
‘కూత’ వేటు దూరంలో..
● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్ పనులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం స్టేషన్, ప్లాట్ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ రైల్వేస్టేషన్ ప్రారంభమైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతుంది.

30వరకు దరఖాస్తుల స్వీకరణ

30వరకు దరఖాస్తుల స్వీకరణ