
21న మెగా ఫార్మా జాబ్ మేళా
సిద్దిపేటఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఈనెల 21న మెగా ఫార్మా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, అరబిందో ఫార్మా, బయోకాన్, భారత్బయోటెక్ హెటిరో లాబ్స్, బయోలజికల్ తదితర కంపనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. డిగ్రీ ఉండి, 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న పురుష అభ్యర్థులందరికీ అవకాశం ఉంటుందన్నారు. పాలిటెక్నిక్, కెమిస్ట్రీతో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు హైదరాబాద్ జీడిమెట్లలో మూడు నెలల పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందిస్తారని తెలిపారు. అనంతరం రూ.15వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పనుల్లో నాణ్యతా
ప్రమాణాలు తప్పనిసరి
డీఈఈ శ్రీనివాస్రెడ్డి
దుబ్బాకటౌన్: రాయపోల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించబోమని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఏఈఈ, సీఆర్పీలు తదితరులున్నారు.
ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్కు మొదటి రోజు 177 మంది విద్యార్థులు హాజరు కాగా అధ్యాపకులు సర్టిపికెట్లు పరిశీలించి ఐడీ, పాస్వర్డు అందజేశారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకున్న విద్యార్థులకు గురువారం వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఐడీ పాస్వర్డు పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు.

21న మెగా ఫార్మా జాబ్ మేళా