పటాన్చెరు: అమీన్పూర్ డివిజన్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు అతి త్వరలో అత్యధిక వసతులతో కూడిన క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో అమీన్పూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం, నవ్య రోడ్డులో నూతన పాఠశాలలకు, కిష్టారెడ్డి పేటలో ఉన్నత పాఠశాల పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వీటి నిర్మాణం ద్వారా ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఆటస్థలాలు, డిజిటల్ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్లు, లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


